వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన "వ్యూహం" సినిమా రిలీజ్ ఖాయమైంది. ఈ నెల 29న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
సెన్సార్ అడ్డంకులతో సినిమా ఆగిపోయినప్పుడు, "అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేనట్లే, మా సినిమా థియేటర్స్ లోకి రావడాన్నీ అడ్డుకోలేరని" రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఆయన మాటలు నిజమయ్యాయి. సినిమాకు చివరికి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది.
ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించారు. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. సినిమాలో రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పాత్రలను పోలిన క్యారెక్టర్స్ కూడా ఉంటాయి.
సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, "ఈ సినిమాలో ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలు. అలాంటి అంశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. పవన్ కల్యాణ్ జనసేన పెట్టినప్పుడు ప్రసంగం విన్నాను. ఆ తర్వాత పవన్ స్టెప్స్ చూస్తే, ఆయన రాజకీయ ప్రయాణంలో స్థిరత్వం లేదనిపించింది. ఏ విషయాన్నైనా ఎవరికి వారు వారి కోణంలో అర్థం చేసుకుంటారు. వ్యూహం నాకు అర్థమైన కోణంలో రూపొందించిన సినిమా" అని అన్నారు.
నిర్మాత దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, "దేవుడు కొందరి చేత కొన్ని పనులను లోక కల్యాణం కోసం చేయిస్తుంటాడు. అలా నాతో ఈ సినిమా చేయించాడు అని భావిస్తున్నా. రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తిని ఎవరూ డబ్బుతో కొనలేరు. ఆర్జీవీకి వెలకట్టలేని వ్యక్తిత్వం ఉంది. ప్యాకేజీలకు అతీతమైన వ్యక్తి ఆయన" అని అన్నారు.